న్యూ ఢిల్లీ : లడఖ్ లోని పాంగోంగ్ సరస్సు ఉత్తర, దక్షిణ తీరాల్లో సైన్యాన్ని వెనక్కు తీసుకునేందుకు చైనా అంగీకరించిందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం రాజ్యసభలో ప్రకటించారు. బలగాల ఉపసంహరణ కు చైనాతో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయన్నారు. పరస్పర సమన్వయంతో దశల వారీగా బలగాల ఉపసంహరణ ఉంటుందన్నారు. ‘‘ఫింగర్ 2, ఫింగర్ 3 మధ్య ఉన్న ధన్ సింగ్ థాపా పోస్ట్ కు మన సైనికులు తిరిగి వచ్చేస్తారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు ఫింగర్ 8 తూర్పు ప్రాంతానికి వెళతారు. ప్రస్తుతం ఘర్షణ జరిగిన ప్రాంతాన్ని నో పెట్రోలింగ్ జోన్’గా గుర్తిస్తారని చెప్పారు.పాంగోంగ్ ఉత్తర దిక్కునున్న ఫింగర్ 8 తూర్పు ప్రాంతం చైనాకు, ఫింగర్ 3 పోస్ట్ భారత్ కు శాశ్వత స్థావరాలుగా ఉంటాయన్నారు. పాంగోంగ్ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణ పూర్తయిన తర్వాత 48 గంటల్లో రెండు దేశాల కమాండర్ స్థాయి సమావేశం జరుగుతుందని చెప్పారు.