ఢిల్లీ : ఎన్నికల ప్రచారం ముగిసేలోపు ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కసారైనా ప్రజా సమస్యలపై మాట్లాడతారా అని కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం నిలదీశారు. బుధవారం ఆయన ట్విటర్ ద్వారా ప్రధానికి అనేక ప్రశ్నలు సంధించారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి కీలక అంశాలను గాలికొదిలేసి పాకిస్తాన్పై తీసుకున్న చర్యలను పదే పదే వల్లె వేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విరుచుకుపడ్డారు. పాకిస్తాన్పై చర్యల విషయంలో ఆయన పదే పదే సొంత గొప్పలు చెప్పుకోవడం విని అలసిపోయామన్నారు. నిరుద్యోగం, రైతాంగ సంక్షోభం, వివిధ వర్గాల్లో నెలకొన్న అభద్రతా భావం లాంటి అంశాల్లో ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు కుదేలవడం, పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి అంశాలపై ప్రధాని మాట్లాడితే ప్రజలు వినాలనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.