టీమిండియా ఎక్కడ ఉంటే భారత్ ఆర్మీ అక్కడ వాలిపోతోంది. 20 ఏళ్ల క్రితం యూకేలో ప్రారంభమైన ఈ ఆర్మీ టీమిండియా వెన్నంటే నడుస్తోంది. ఆస్ట్రేలియా పర్యటనలో, ఇప్పుడు న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టును ప్రోత్సహిస్తూ కనిపించింది. మ్యాచ్లో బాగా రాణించిన వారి పేరుమీద పాట పాడటం భారత్ ఆర్మీ ప్రత్యేకత. ఇంతకు ముందు ఆసీస్ పర్యటనలో యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ మీద పాట పాడిన వీళ్లు ఇప్పుడు యుజువేంద్ర చాహల్ మీదా ఓ పాట పాడారు. టీమిండియా-న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఐదో వన్డే మ్యాచ్ పూర్తయిన అనంతరం భారత్ ఆర్మీ వేడుకల్లో మునిగిపోయింది. ఆఖరి వన్డేలో ఆతిథ్య జట్టుపై రోహిత్ జట్టు గెలవడంతో భారత్ ఆర్మీ ఆనందానికి అవధుల్లేవు. టీమిండియా జట్టులో తాము కూడా భాగమని జట్టులో తాము 12వ ఆటగాడితో సమానమని భారత్ ఆర్మీలోని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో మూడు వికెట్లు తీసిన చాహల్ మీద ఓ పాటేసుకుని తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్లో పోస్ట్ చేసింది. కివీస్ జట్టుతో జరిగిన ఐదు వన్డేల సిరీస్లో టీమిండియా 4-1తేడాతో సిరీస్ నెగ్గిన విషయం తెలిసిందే. ఆతిథ్య జట్టుతో ఈనెల 6నుంచి జరగనున్న మూడు టీ20ల సిరీస్ కోసం టీమిండియా సన్నద్ధమవుతుతోంది.