తిరువనంతపురం ; భాగమతి సినిమాలో పోలీసు అధికారిగా నటించిన మలయాళ నటి ఆశా శరత్ ప్రచారం కోసం పెడ మార్గాన్ని ఎంచుకుని అభాసుపాలయ్యారు. మలయాళంలో ఆమె నటించిన ఎవిడే చిత్రం ప్రచారంలో భాగంగా తన ఫేస్బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్టు చేశారు. తన భర్త కనిపించడం లేదని, ఎక్కడైనా కనిపిస్తే కేరళలోని కట్టప్పన పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు. మేకప్ లేకుండా బాధ పడుతున్నట్లుగా ఉన్న ఆమె వీడియోను చూసి చాలా మంది నిజమేననుకున్నారు. ఓ న్యాయవాది అయితే పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఇది కాస్తా సీరియస్ కావడంతో ఇది సినిమా కోసం చేసిన ప్రచార వీడియో అని వెల్లడిస్తూ ఆశా అసలు విషయాన్ని మెల్లగా బయటపట్టారు. దీంతో నెటిజన్లు ఆమె తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.