అద్భుతంగా రాణిస్తూ టీమిండియాకు విజయాలందిస్తున్న క్రికెటర్లు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నారు. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లీ 887 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అలాగే బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా 808 పాయింట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఒక స్థానం మెరుగుపరుచుకున్న టీమిండియా స్పిన్నర్ చాహల్ ఐదో ర్యాంక్ దక్కించుకున్నాడు. ఇటీవల వరుస అర్ధశతకాలు చేసి ఫామ్లోకి వచ్చిన సీనియర్ ఆటగాడు ధోనీ మూడు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో జరిగిన వన్డే సిరీస్లను చేజిక్కించుకున్నప్పటికీ జట్టు ర్యాంకింగ్స్ విషయంలో టీమిండియా రెండో స్థానంలోనే కొనసాగుతోంది. 122 పాయింట్లతో టీమిండియా.. ఇంగ్లండ్ (126 పాయింట్లు) తర్వాత రెండో స్థానంలో ఉంది.