ఢిల్లీ : తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులకు మొండి చేయి సహా, దక్షిణ రాష్ట్రాలపై కేంద్రం పక్షపాతాన్ని ప్రదర్శించిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్య, ఉద్యోగాలకు ప్రోత్సాహాన్ని అందించే ఎలాంటి పథకాలను బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు. ఉత్తరప్రదేశ్ రూ.1 పన్ను చెల్లిస్తే, ఆ రాష్ట్రానికి రూ.2 తిరిగి వెళుతోందన్నారు. బిహార్కు రూపాయికి రూపాయి చెల్లిస్తున్నారని, దక్షిణ రాష్ట్రాలకు రూపాయికి 65 పైసలు మాత్రమే తిరిగి ముట్టుతోందని ఆరోపించారు. ఆదాయ పన్నులో మధ్య తరగతి ప్రజలకు పెద్దగా ఉపశమనం లభించలేదని విమర్శించారు. ఆర్థిక మంత్రి దక్షిణాదికి చెందిన వారైనా ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మే అని ఘాటుగా విమర్శించారు.