లండన్ : బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ధ్రువీకరించారు. గత 24 గంటల్లో తనలో కరోనాకు సంబంధించిన స్వల్ప లక్షణాలు బయటపడ్డాయని, పరీక్ష చేయించుకున్నాక నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. తనకు తాను ఒంటరి జీవితాన్ని గడుపుతున్నానని, కానీ కరోనాపై యుద్ధంలో తన వంతు కృషి చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. కరోనాకు సంబంధించి ప్రభుత్వపరమైన నిరోధక చర్యలపై వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా సమీక్షిస్తున్నానని తెలిపారు. బ్రిటన్ ప్రధాని నివాసం…డౌనింగ్ స్ట్రీట్ అధికార ప్రతినిధి దీనిపై మాట్లాడుతూ 55 ఏళ్ల జాన్సన్లో గురువారం కరోనా సంబంధిత లక్షణాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. అంతకు ముందే రోజే ఆయన హౌస్ ఆఫ్ కామన్స్ ఛాంబర్లో వారం వారం నిర్వహించే ప్రశ్నలు-జవాబుల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంగ్లండ్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ప్రొఫెసర్ క్రిస్ విట్టీ వ్యక్తిగత సలహా మేరకు ప్రధాని వైద్య పరీక్షలు చేయించుకున్నారని, అందులో పాజిటివ్గా తేలిందని అధికార ప్రతినిధి వివరించారు.