ముంబై : ప్రముఖ బాలీవుడ్ గాయని కనికా కపూర్కు కరోనా పాజిటివ్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇటీవల లండన్ నుంచి లఖ్నవూకు వచ్చిన ఆమె కొన్నిరోజుల క్రితం దాదాపు 400 మంది స్నేహితులు, సన్నిహితుల కోసం ఓ డిన్నర్ పార్టీని ఇచ్చారు. అయితే గత నాలుగు రోజుల నుంచి జలుబు ఉండడంతో వైద్యులను సంప్రదించిన ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ధ్రువీకరించారు. కనికా కపూర్కు కరోనా పాజిటివ్ రావడంతో ఆమె నివాసం ఉండే అపార్ట్మెంట్లోని ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అంతేకాకుండా కరోనా పరీక్షల నిమిత్తం వైద్యులను సంప్రదిస్తున్నారని పలు బాలీవుడ్ వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి. దీంతో తనకి కరోనా ఉందని నిర్ధారించడంతో కనికా కపూర్ స్పందించారు. ‘పదిరోజుల క్రితం నేను ఇండియాకు వచ్చిన సమయంలో ఎయిర్పోర్ట్లో కరోనా టెస్టులు చేశారు. కానీ, నాలుగు రోజుల నుంచి మాత్రమే నాలో కరోనా లక్షణాలు కనిపించాయి. గత నాలుగు రోజుల నుంచి నాకు జలుబు బాగా ఉండడంతో వైద్యులను సంప్రదించి పరీక్ష చేయించాను. కరోనా పాజిటివ్గా వాళ్లు నిర్ధారించారు. ప్రస్తుతం నేను, నా కుటుంబం వైద్యుల సూచనలను అనుసరిస్తూ స్వీయ నిర్బంధంలో ఉన్నాం. లండన్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ నేను సన్నిహితంగా ఉన్నవారందరిని అధికారులు గుర్తిస్తున్నారు.’ అని కనికా కపూర్ స్పందించారు.