హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలని, దీని కోసం పార్టీ కార్యకర్తలు అహరహం శ్రమించాలని పార్టీ సనత్ నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జి, బీజేపీ కర్ణాటక శాఖ కార్యదర్శి ఎం. సతీష్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సనత్ నగర్ నియోజకవర్గం బీజేపీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. స్మార్ట్ సిటీ లాంటి వినూత్న ప్రాజెక్టులతో నగరాల అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తున్నదని ఆయన
గుర్తు చేశారు. జీహెచ్ఎంసీలో బీజేపీ విజయం సాధించడం ద్వారా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటే హైదరాబాద్ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు నగర ప్రజల
దృష్టికి తీసుకు పోవడం ద్వారా వారి మన్ననలు పొందాలని సతీష్ రెడ్డి సూచించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే వరద బాధితులకు ఇంటింటికీ రూ.25 వేల చొప్పున అందజేస్తామని, మోటారు సైకిళ్లు, కార్లు పోగొట్టుకున్న వారిని ఆదుకుంటామని బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ, ఈ హామీని కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి
తీసుకెళ్లాలని కోరారు. ఇటీవల దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ సాధించిన అనూహ్య విజయం ప్రేరణగా, ఈ పది రోజులు కార్యకర్తలు కష్టపడి పని చేయాలని సతీష్ రెడ్డి ఉద్బోధించారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర శాఖ సీనియర్ నాయకురాలు బల్మూరి వనిత, రాష్ట్ర నాయకుడు ఎస్. కుమార్, పార్టీ సీనియర్ బిజెపి నాయకుడు బల్మూరి అమరేందర్ రావు, రామగుండం అసెంబ్లీ కన్వీనర్ మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.