ముంబయి: క్రికెటర్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య ఓ షోలో పాల్గొని చేసిన వ్యాఖ్యల మీద వివాదం ముదురుతున్నట్లు కనిపిస్తోంది. వారిద్దరి మీద రెండు వన్డే మ్యాచ్ల నిషేధం విధించాలని పాలకుల కమిటీ(సీఓఏ) ఛైర్మన్ వినోద్ రాయ్ గురువారం సూచించారు. బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రీకి పంపిన మెయిల్లో ఈ ప్రతిపాదన చేశారు. ‘ షో సందర్భంగా వారిద్దరూ చేసిన వ్యాఖ్యలను ఈ రోజు పరిశీలించారు. అవి ఆమోదయోగ్యంగా లేవు. క్షమాపణలు ఆ తప్పును కప్పిపుచ్చలేవు. వారిపై ఎలాంటి పెనాల్టీ విధించాలో డయానాను అడిగాను. రెండు మ్యాచ్ల నిషేధం సరైందని భావిస్తున్నాను. దానికి డయానా అంగీకరిస్తే, రాహుల్ దానికి సంబంధించిన విధివిధానాలను రూపొందించండి. అలాగే బీసీసీఐ కాంట్రాక్టు ఆటగాళ్లు, సిబ్బందికి విడిగా నిబంధనలను సిద్ధం చేయండి’ అని దానిలో వెల్లడించారు.
బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించే షోలో పాల్గొన్న సందర్భంగా పాండ్య మహిళలనుద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దానిలో పాల్గొన్న పాండ్య, రాహుల్కు బుధవారం బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. విమర్శల నేపథ్యంలో పాండ్య ట్విటర్ వేదికగా క్షమాపణలు చెప్పాడు. ‘హార్దిక్ వివరణతో నేను సంతృప్తి చెందలేకపోతున్నా. వారిద్దరి మీద రెండు మ్యాచ్ల నిషేధం విధించాలని సూచించా’ అని రాయ్ వెల్లడించారు. సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జి ఈ వ్యవహారాన్ని బీసీసీఐ లీగల్ సెల్ దృష్టికి తీసుకెళ్లింది. అలాగే ఆమె బీసీసీఐ యాక్టింగ్ ప్రెసిడెంట్ సీకే ఖన్నా, యాక్టింగ్ సెక్రటరీ అమితాబ్ చౌధరీ, కోశాధికారి అనిరుధ్ చౌధరీ అభిప్రాయాన్ని కోరినట్లు తెలుస్తోంది….