హైదరాబాద్ : బాలకృష్ణ డైలాగులతో అలరించి ‘జూనియర్’ బాలయ్యగా పేరు పొందిన గోకుల్ సాయి కృష్ణ శుక్రవారం మృతి చెందాడు. చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని ఎ.వి.నాయుడు కాలనీకి చెందిన యోగేంద్ర, సుమాంజలిల రెండో కుమారుడైన గోకుల్ను, రెండు రోజుల నుంచి జ్వరం రావడంతో బెంగళూరులోని రెయిన్హో ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా గోకుల్ మృతి పట్ల సంతాపం తెలిపారు. `మాకు అభిమానుల కంటే విలువైనది మరొకటి ఉండదు. నేనంటే ప్రాణం ఇచ్చే చిన్నారి అభిమాని గోకుల్ ఈరోజు ప్రాణాలతో లేడన్న నిజం నా మనసును కలచివేసింది. అతడు డైలాగులు చెప్పిన విధానం, హావభావాలు చూసి నాకు ఎంతో ముచ్చటగా అనిపించేది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ చిన్నారి ఇంత చిన్న వయసులో డెంగ్యూ జ్వరంతో ఈ లోకాన్ని విడిచి వెళ్లడం నాకు బాధ కలిగించింది. ఈ చిన్నారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. అతని కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.’ అని బాలకృష్ణ పేర్కొన్నారు.