బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో లక్నోలోని సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారందరూ నిర్దోషులేనని జడ్జి సురేష్ కుమార్ యాదవ్ సంచలన తీర్పును వెలువరించారు.అయితే, ఈ కేసు విచారణ 28 ఏళ్ల పాటు సుధీర్ఘంగా సాగింది. కోర్టు తీర్పుతో బీజేపీ కీలక నేతలు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతితో మొత్తం 32 మంది నిర్దోషులుగా తేలారు. యావత్ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసిన ఈ కేసు తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా కోర్టు ప్రధానంగా ఐదు కీలక విషయాలను ప్రస్తావించింది.
* బాబ్రీ మసీదు కూల్చివేత ఒక ముందస్తు ప్రణాళిక ప్రకారం జరగలేదు.
* నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు లేవు.
* సీబీఐ అందించిన వీడియో, ఆడియోల ప్రామాణికత్వాన్ని విశ్వసించలేము.
* మసీదును కూల్చేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నించగా… నిందితులుగా పేర్కొన్న నాయకులు వారిని ఆపేందుకు యత్నించారు.
* నేతల ప్రసంగాల ఆడియో స్పష్టంగా లేదు.
కాగా, 1992, డిసెంబర్ 6వ తేదీన అయోధ్యలోని బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో లక్నో సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. అయితే బాబ్రీని కూల్చినవాళ్లు సంఘవ్యతిరేకులని కోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయం తెలిసిందే..