నేడో,రేపో లోక్సభ
ఎన్నికలకు నగార మోగనున్న నేపథ్యంలో పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలు వేగవంతం చేసాయి.గత
ఏడాది తెరాస చేతిలో చావుదెబ్బ తిన్న కాంగ్రెస్ నేతలు లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి సర్వశక్తులు ధారపోస్తున్నారు.జిల్లాల
వారీగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సర్వేలు చేయించి జిల్లాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన
టీపీసీసీ రెండు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాలకు గట్టిపోటీ ఉన్నట్లు గ్రహించింది.కొన్ని
నియోజకవర్గాల్లో అంగబలంఅ,అర్థబలం ఉన్న నేతల వైపు మొగ్గు చూపుతుండగా మరికొన్ని నియోజకవర్గాల్లో
ప్రజాదరణ ఉన్న నేతల వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.ఇక హైదరాబాద్ నుంచి బలమైన ఎంఐఎం
నేత అసదుద్దీన్ ఓవైసీని ఢీకొట్టడానికి మైనారిటీ వర్గానికి చెందిన అంతేబలమైన అభ్యర్థిని
బరిలో దించడానికి కసరత్తులు ముమ్మరం చేసింది.అందులో భాగంగా మాజీ క్రికెటర్ అజారుద్దీన్
లేదా ఫిరోజ్ఖాన్లను అసదుద్దీన్కు ప్రత్యర్థిగా బరిలో దించడానికి టీపీసీసీ భావిస్తోంది.దీంతోపాటు
చేవెళ్ల,నాగర్కర్నూల్,మహబూబ్నగర్ తదితర నియోజకవర్గాలకు కూడా గట్టిపోటీ నెలకొంది.నాగర్కర్నూల్
నుంచి నంది ఎల్లయ్య ప్రస్తుతం ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తుండగా ఈసారి కొత్త అభ్యర్థులకు
అవకాశమివ్వాలంటూ జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్
పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.మహబూబ్నగర్ నుంచి పోటీ చేయడానికి మాజీ ఎమ్మెల్యే
చల్లా వంశీచందర్రెడ్డి ఆసక్తి చూపుతున్నారు.భువనగిరి నియోజకవర్గం టికెట్ కోసం మాజీ
ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ,మాజీ ఎంసీ మధుయాష్కిగౌడ్లు పోటీ పడుతున్నారు.చేవెళ్ల నుంచి
సిట్టింగ్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేయడం
దాదాపు ఖాయమని పార్టీ వర్గాలే స్పష్టం చేశాయి.వీటితో పాటు మల్కాజ్గిరి,వరంగల్,మహబూబాబాద్,ఖమ్మం,కరీంగనర్,నిజామాబాద్,మెదక్,పెద్దపల్లి,నల్గొండ,ఆదిలాబాద్,సికింద్రాబాద్,జహీరాబాద్
నియోజవకర్గాలకు కూడా ప్రముఖ నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై టీపీసీసీ
నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు.కచ్చితంగా గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇవ్వడానికి నిర్ణయించుకొని
అభ్యర్థుల జాబితా ప్రకటించిన అనంతరం చెలరేగే అసంతృప్తులను ఎలా చల్లార్చాలనే విషయంపై
కూడా తీవ్రంగా సమాలోచనలు చేస్తున్నారు..