అక్షర్‌ పటేల్‌కు కరోనా

  • In Sports
  • April 3, 2021
  • 145 Views
అక్షర్‌ పటేల్‌కు కరోనా

ముంబై: ఒకవైపు ఐపీఎల్-14 సీజన్‌కు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ కరోనా వైరస్ భయం క్రికెటర్లను వెంటాడుతోంది. ఇప్పటికే కేకేఆర్ ఆటగాడు నితీష్ రాణాకు కరోనా సోకగా, తాజాగా మరో క్రికెటర్ కరోనా బారిన పడటం కలకలం రేపుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్‌రౌండర్‌ అక్షర్ పటేల్‌కు కరోనా వైరస్ సోకింది. తాజాగా అక్షర్‌కు చేసిన కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ప్రకటించింది. ‘అక్షర్‌కు కరోనా వైరస్ సోకింది. ఇది చాలా దురదృష్టకరం. ప్రొటోకాల్స్ ప్రకారం అక్షర్ ఐసోలేషన్‌కు వెళ్లనున్నాడు’ అని తెలిపింది. ఈ నెల 9వ తేదీ నుంచి ఐపీఎల్‌ ఆరంభం కానున్న తరుణంలో ఆటగాళ్లంతా క్వారంటైన్ నియమాలు పాటిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా, అక్షర్‌కు చేసిన కరోనా టెస్టులో ఆ వైరస్ సోకిందని తేలడంతో ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో ఆందోళన మొదలైంది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) నియమావళి ప్రకారం అక్షర్ పది రోజుల పాటు ప్రత్యేక ఐసోలేషన్‌లో ఉండనున్నాడు. అతనికి కరోనా నెగిటివ్ వచ్చిన తర్వాతే జట్టుతో కలవనున్నాడు.

ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్ ద్వారా ఆ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన అక్షర్‌ మొత్తం 27వికెట్లు సాధించి సత్తా చాటాడు. మరొకవైపు ఐదు మ్యాటుల ట్వంటీ 20 సిరీస్‌లో కూడా అక్షర్ ఆడాడు. కాగా,ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచును ఏప్రిల్ 10వ తేదీన సీఎస్‌కేతో ఆడాల్సి ఉంది. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ముంబైలో మ్యాచులు జరపాలా.. వద్దా అనే డైలమాలో ఉంది బీసీసీఐ.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos