అమరావతి : సార్వత్రిక ఎన్నికలకు ముందు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఐటీ గ్రిడ్స్ వ్యవహారానికి సంబంధించిన కేసులో అశోక్కు హైకోర్టు సోమవారం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో వారంలో ఒక రోజు పోలీసు విచారణకు హాజరు కావాలని షరతు విధించింది. ప్రజలకుసంబంధించిన సమాచారాన్నంతటినీ ఐటీ గ్రిడ్స్ సంస్థ సేకరించిందనే ఆరోపణలపై ఎస్ఆర్ నగర్, మాదాపూర్ పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు ఆ సంస్థలో సోదాలు నిర్వహించారు. కీలక డాక్యుమెంట్లు, ఇతర సమాచారాన్ని సేకరించారు. విచారణకు హాజరు కావాలని అశోక్కు పలుమార్లు నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయి విచారణకు గైర్హాజరవుతూ వచ్చారు. ఇక ఆయనను అరెస్టు చేయాలని పోలీసులు ప్రయత్నిస్తుండగా, ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.