న్యూ ఢిల్లీ: లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనలో హత్యారోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా శుక్రవారం పోలీసు విచారణకు హాజరుకాలేదు. ఉదయం 10 గంటలకు ఆశిష్ మిశ్రా హాజరు కావాలి. 10.30 గంటల వరకూ ఆయన రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. దర్యాప్తు బృందానికి నాయకత్వం వహిస్తున్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (హెడ్క్వార్టర్స్) ఉపేంద్ర అగర్వాల్ సకాలానికే కార్యాలయానికి చేరుకున్నారు.అజయ్ మిశ్రాను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించి, అశిష్ మిశ్రాను అరెస్టు చేయకుంటే భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ఇప్పటికే హెచ్చరించింది. మిశ్రా అరెస్టు కోసం వేచి చూస్తున్నట్టు మోర్చా నేతలు తెలిపారు. లఖింపూర్ ఖేరి ఘటనకు సంబంధించి ఇద్దరిని గురువారం అరెస్టు చేసారు.