వాషింగ్టన్ : కళాశాలలో కంప్యూటర్లను ఉద్దేశపూర్వకంగా చెడగొట్టాడనే ఆరోపణపై ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ విద్యార్థికి అమెరికాలో ఏడాది జైలు శిక్షతో పాటు 58,741 డాలర్ల జరిమానా విధించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్ (27) 2015 నుంచి విద్యార్థి వీసాపై అమెరికాలో ఉన్నాడు. న్యూయార్క్లోని అల్బనీలో అతను చదివే సెయింట్ రోస్ కళాశాలలో 66 కంప్యూటర్లకు యూఎస్బీ కిల్లర్ పెట్టాడని, దీని వల్ల పరికరాలు దెబ్బతిన్నాయని ఫిబ్రవరిలో అభియోగం నమోదైంది. అదే నెల 22న అతనిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణ అనంతరం కోర్టు అతనికి శిక్ష, జరిమానా విధించింది. యూఎస్బీ కిల్లర్ను యూఎస్బీ పోర్టులో పెడితే, కంప్యూటర్లలోని ఎలక్ట్రానిక్ విడి భాగాలు విద్యుత్ హెచ్చు తగ్గులకు లోనై దెబ్బతినే అవకాశం ఉంది.