అమేథీ: అమేథీ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామపత్రం స్వీకరణపై నెలకొన్న ఉత్కంఠత వీడిపోయింది. ఆయన నామ పత్రాన్ని అంగీకరించినట్లు ఎన్నికల అధికారి రామ్ సోమవారం ప్రకటించారు. రాహుల్ గాంధీ విద్యార్హతలు, పౌరసత్వాల గురించి భాజపా అనుమానించటం తెలిసిందే. బ్రిటన్ వ్యాపార సంస్థ పాలక మండలి సంచాలకుడుగా ఉన్నట్లు తెలిపే పత్రాలు రాహుల్ను బ్రిటిష్ పౌరుడిగా పేర్కొనగా, కేం బ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఎం.ఫిల్. చేసినట్లు ప్రమాణ పత్రంలో రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఆ తర్వాత డెవలప్మెంట్ స్టడీస్లో ఎం.ఫిల్.చేసినట్లు చెప్పటాన్ని అమేథీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధ్రువ్ లాల్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఎస్పీ–బీఎస్పీ–ఆర్ఎల్డీ కూటమి అమేథీలో తమ అభ్యర్థిని నిలప లేదు. దీంతో రాహుల్, భాజపా అభ్యర్థి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. కేరళ,వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్నారు.