నిలకడ లేని పవన్ : అంబటి విసుర్లు

నిలకడ లేని పవన్ : అంబటి విసుర్లు

తాడేపల్లి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రాజకీయంగా, వ్యక్తిగతంగా స్థిరత్వం లేని వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. బీజేపీ, జనసేన పొత్తుపై స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. గత ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపలేదని గుర్తు చేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో అంబటి మీడియాతో మాట్లాడుతూ, పవన్‌ ఒక్కొక్క లైబ్రరీలో కూర్చొని పుస్తకం చదువుతూ.. ఒక్కో  రకంగా ప్రభావితం అవుతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదుతామంటే తమకేం అభ్యంతరం లేదని వ్యాఖ్యానించారు. గతంలో బీజేపీ పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని విమర్శించిన పవన్‌కు, ఇవాళ ఆ పార్టీ నేతలు తాజా లడ్డూలు ఏమైనా పంపారా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా  పవన్‌ బీజేపీతో పొత్తు ఎలా పెట్టుకున్నారని అంబటి ప్రశ్నించారు. ప్రజలను మభ్య పెట్టాలనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అని నిలదీశారు. 2014లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ప్రయాణించాయని గుర్తు చేశారు. 2019లో మాత్రం టీడీపీతో పవన్‌ లాలుచీ ఒప్పందం చేసుకుని , వామపక్షాలతో కలిసి పోటీ చేశారని విమర్శించారు. రాజకీయ స్థిరత్వం లేని పవన్‌, ఒక పార్టీతోనైనా దీర్ఘ కాలం ఉన్నారా అనేది ఆలోచించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి స్వచ్ఛమైన పాలన చేస్తుంటే పవన్‌ ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. దుర్మార్గమైన పరిపాలన పోయి, మంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. ఏడు నెలల్లో ఒక్క అవినీతి కూడా జరగలేదని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos