AK-47తోనే బదులిస్తా: జగత్ వ్యాఖ్యలు

AK-47తోనే బదులిస్తా: జగత్  వ్యాఖ్యలు

తన ప్రత్యర్థులకు ఏకే-47తో సమాధానం చెబుతానంటూ సీనియర్ కాంగ్రెస్ నేత నట్వర్ సింగ్ కుమారుడు, రాజస్థాన్‌ బీఎస్పీ నేత జగత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అయినా, వసుందర రాజే, అశోక్ గెహ్లాట్ అయినా తాను వెనక్కి తగ్గనని, ఇదే తీరుగా సమాధానం చెబుతానన్నారు. రామ్‌గఢ్ అసెంబ్లీ సీటుకు జనవరి 28న ఎన్నిక జరగనుంది. బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జగత్ సింగ్ ఓ ర్యాలీలో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మనవాళ్లపై రాళ్లు రువ్వుతుంటే, దాడులు చేస్తుంటే ఆరోజు బీజేపీ ఎక్కడికి పోయింది. 200 మంది మన కార్యకర్తలు ప్రమాదంలో ఉంటే బీజేపీ ప్రభుత్వం కాపాడలేదు. ఇలాంటివి చేస్తే నేను పారిపోను. వాళ్లు కాల్పులు జరిపితే తొలి బుల్లెట్ నాకే తగులుతుంది. వాళ్ల మనమీద జరిపిన రాళ్లదాడికి నేను ఏకే 47తో బదులిస్తాను. ప్రధాని మోదీ ఉన్నా, లేక వసుందర రాజే, గెహ్లాట్ ఉన్నా వాళ్లను ఇక్కడి నుంచి వెళ్లిపోయేలా చేస్తానని’ వివాదాస్పద వ్యాఖ్యలుచేశారు. జగత్ సింగ్ గతంలో భరత్‌పూర్ జిల్లా కమాన్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టికెట్ నిరాకరించడంతో బీజేపీని వీడి బీఎస్పీలో చేరారు. 2003-08 మధ్య కాలంలో కాంగ్రెస్‌లో ఉన్న జగత్ సింగ్ లక్ష్మణ్‌గఢ్ ఎమ్మెల్యేగా పనిచేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos