మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్

మోదీకి మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్

న్యూ ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు గాను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ మనసులో కేవలం హిందూ-ముస్లిం ఉందని, మతం పేరుతో దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. తమపై వ్యాఖ్యలు చేసేముందు.. వారి చరిత్ర ఏంటో చూసుకోవాలని దుయ్యబట్టారు. కాంగ్రెస్‘ముస్లిం లీగ్ సిద్ధాంతం’’ముద్ర ఉందని మోది అన్నారు. ఇందుకు మల్లికార్జున ఖర్గే బదులిస్తూ.. బీజేపీ నాయకులు ముందుగా తమ పార్టీ చరిత్ర చూసుకోవాలని, మతం పేరుతో వాళ్లే దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ మనస్సులో కేవలం హిందూ-ముస్లిం మాత్రమే ఉంది. మతం పేరుతో దేశాన్ని విభజించడం, సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాళ్లు ప్రయత్నిస్తున్నారు. మా కాంగ్రెస్ మేనిఫెస్టోని వాళ్లు సరిగ్గా చదవలేదు. మేము యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం, మహిళలకు సంవత్సరానికి రూ.1 లక్ష ఇస్తామని తెలిపాం, రైతులకు కనీస మద్దతు ధర గ్యారెంటీ.. ఇవన్నీ ముస్లిం లీగ్లో భాగమా?’’ అని ఖర్గే ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఎన్నో హామీలు ఇచ్చింది. ఈసారి ఎలాగైనా బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతో ఈ మేనిఫెస్టోని సిద్ధం చేసింది. ఇందులో.. MSPకి చట్టపరమైన హామీ, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు, అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేయడం, వచ్చే పదేళ్లలో జీడీపీని రెట్టింపు చేయడం, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని పటిష్టం చేయడం, చైనాతో యథాతథ స్థితిని పునరుద్ధరించడం వంటి అనేక వాగ్దానాలు ఉన్నాయి. అంతేకాదు.. 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు మొబైల్ ఫోన్లు ఇవ్వడంతో పాటు ‘GST’ని సవరిస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos