అబ్బూరి ఛాయాదేవి అస్తమయం

అబ్బూరి ఛాయాదేవి అస్తమయం

హైదరాబాద్: ప్రముఖ తెలుగు రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి శుక్రవారం ఉదయం ఇక్కడ తుది శ్వాస విడిచారు. ఆమె మృతి తెలుగు సాహిత్యానికి తీరని లోటు. తెలుగు సాహిత్య లోకాన్ని విషాద సముద్రంలో ముంచింది. తూర్పు గోదావరి జిల్లా రాజమమండ్రిలో 1933 అక్టోబర్ 13న జన్మించారు. భర్త ప్రముఖ రచయిత, విమర్శకుడు, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు అబ్బూరి వరదరాజేశ్వర రావు. తెలుగు సాహిత్య విమర్శ కూడా చేసిన ఆమె స్త్రీ వాద రచయిత్రిగా ఆమె ప్రసిద్ధి పొందారు. ఆమె కథలు ఆంగ్లంతో బాటు ఇతర భాషల్లోకి కూడా అనువాదమయ్యాయి. ఆరో దశకంలో ఛాయాదేవి ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం గ్రంథపాలకురాలుగా విధులు నిర్వర్తించారు. పిల్లల కోసం అనగనగా… అనే జానపద కథల సంపుటిని వెలువరించారు. 1991లో అబ్బూరి ఛాయాదేవి కథలు పేరుతో సంకలనం వచ్చింది. 1993లో మృత్యుంజయ అనే దీర్ఘ కథ రాశారు. మరో కథల సంపుటి- బొన్సాయ్ కథలు సాహిత్య పాఠకుల మన్ననలు పొందాయి. కథల్లో బోన్‌సాయ్ బ్రతుకు, ప్రయాణం సుఖాంతం, ఆఖరికి ఐదు నక్షత్రాలు, ఉడ్ రోజ్ కథలు చాలా ప్రసిద్ధిపొందాయి. ఆడపిల్లల పెంపకంలోను, మగ పిల్లల పెంపకంలోను వివక్ష చూపిస్తూ ఆడవాళ్ళ బ్రతుకుల్ని బోన్ సాయ్ చెట్టులా ఎదగనివ్వటం లేదని చెప్పే కథ బోన్సాయ్ బ్రతుకు. ఈ కథని 2000 సంవత్సరంలో ఆంధ్రపదేశ్ ప్రభుత్వం 10వ తరగతి తెలుగు వాచకంలో చేర్చింది. సుఖాంతం అనే కథ నేషనల్ బుక్ ట్రస్ట్ వారి కథాభారతి అనే సంకలనంలో 1972లో ప్రచురితమైంది.తన మార్గం అనే కథల సంపుటికి 2005లో సాహిత్య అకాడమీ పురస్కారాన్ని, 2003లో వాసిరెడ్డి రంగనాయకమ్మ ప్రతిభా పురస్కారం, 1996లో తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాల్ని పొందారు. ఆమె మామ గారు అబ్బూరి రామకృష్ణా రావు మంచి సాహితీవేత్త . మొదట భావ కవిత్వం, ఆ తర్వాత అభ్యుదయ కవిత్వం రాశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos