ఎంత కొట్టినా,తిట్టినా తమ తీరు కుక్క తోక వంకరేనన్న విషయాన్ని పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది మరోసారి బయటపెట్టుకున్నాడు.కశ్మీర్పై,భారత ప్రధాని నరేంద్రమోదీపై నోరుజారి చివాట్లు తిన్నా అఫ్రిదికి బుద్ధి వచ్చినట్లు కనిపించడం లేదు.తాజాగా మరోసారి కశ్మీర్పై అవాకులు చవాకులు పేలి ఉగ్రవాదికి తాను ఏమాత్రం తీసిపోనని చాటుకున్నాడు.కశ్మీర్ జట్టును పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్)లో ఆడటానికి అనుమతి ఇవ్వాలంటూ ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ)కి విజ్ఞప్తి చేశాడు. పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీ ఉండాలంటూ కొత్త రాగం అందుకున్నాడు. వచ్చే పీఎస్ఎల్ సీజన్ నాటికే కశ్మీర్ టీమ్ ఏర్పాటుకు కృషి చేయాలంటూ మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరో అడుగు ముందుకేసి తన చివరి పీఎస్ఎల్ సీజన్లో ఆ జట్టుకు తానే నాయకత్వం వహించాలన్నాడు పీసీబీకి ఇదే నా విన్నపం. తదుపరి పీఎస్ఎల్లో కశ్మీర్ పేరిట ఒక ఫ్రాంచైజీని తయారు చేయండి. ఈ జట్టుకు నేనే సారథిగా వ్యహరించి పీఎస్ఎల్కు వీడ్కోలు చెబుతా. కశ్మీర్ జట్టుకు సారథిగా చేసే అవకాశాన్ని నేనే ఉపయోగించుకుంటా. కచ్చితంగా పీఎస్ఎల్లో కశ్మీర్ జట్టు ఉండాల్సిందే’ అంటూ ఒకవైపు విజ్ఞప్తి, మరొకవైపు డిమాండ్ అనే విధంగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అదే సమయంలో కశ్మీర్లకు ఒక స్టేడియం, ఒక అకాడమీని కూడా ఏర్పాటు చేయాలన్నాడు. దీనికి తాను కరాచీ నుండి వచ్చి సాయం చేస్తానంటూ ఎప్పుడూ లేని ప్రేమను కురిపించాడు. ఇక్కడ దాదాపు 125 క్రికెట్ క్లబ్లు ఉన్నట్లు విన్నానని, వీటి మధ్య టోర్నమెంట్లు నిర్వహించే దిశగా ఏర్పాట్లు కూడా చేయాలని పీసీబీకి కొత్త తలపోటును తెచ్చిపెట్టాడు. కశ్మీర్లో మ్యాచ్లు చూడటానికి సంతోషంగా ఇక్కడకి వస్తానని, నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి తనతో పాటు కరాచీకి తీసుకువెళ్తానన్నాడు.అఫ్రిది వ్యాఖ్యలపై ఈసారి భారతీయుల నుంచి ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి..