తెలుగు నటీమణి, కన్నడ ఇంటి కోడలు సుమలత ఎంపీగా ఎన్నిక కావడం లాంఛనంగానే కనిపిస్తోంది. ఆమె రాజకీయాల పట్ల ఆసక్తిని కనబరుస్తూ ఉన్నారని సమాచారం. ఇటీవలే అంబరీష్ మరణం నేపథ్యంలో సుమలత పొలిటికల్ ఎంట్రీ ఖాయమైనట్టుగా తెలుస్తోంది. భర్త సొంత నియోజకవర్గం మండ్య నుంచి సుమలత ఎంపీగా పోటీచేయడం ఖాయమైనట్టే అనుకోవాలి.అటు కాంగ్రెస్ పార్టీ సుమలతను ఎంపీగా బరిలోకి దించేందుకు రెడీగా ఉంది. అంబరీష్ మరణం నేపథ్యంలో సానుభూతి కలిసి వస్తుందనేది కాంగ్రెస్ అంచనా. ఇటు జేడీఎస్ కూడా సుమలత అభ్యర్థిత్వానికి ఓకే చెప్పే అవకాశాలే ఉన్నాయి.తన చరమాంకంలో కాంగ్రెస్ కు దూరం అయ్యాడు అంబరీష్. జేడీఎస్ కు దగ్గరయ్యాడు ఆయన. వచ్చే ఎన్నికల్లో ఎలాగూ కాంగ్రెస్-జేడీఎస్ కూటమిగా పోటీచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో సుమలత అభ్యర్థిత్వానికి ఇరు పార్టీల మద్దతు ఉన్నట్టే.మండ్య ప్రాంతం గౌడల అడ్డా. ఇటీవలే ఉపఎన్నిక జరిగితే మండ్య సీటును జేడీఎస్ నిలబెట్టుకుంది. ఈ సీటు తమ పార్టీకి ఆటపట్టైన ప్రాంతం కావడంతో.. ఇక్కడ నుంచి బరిలోకి దిగడానికి కుమారస్వామి తనయుడు, నటుడు నిఖిల్ గౌడ ఉత్సాహం చూపిస్తున్నాడు.అయితే అంబరీష్ కూడా సేమ్ కమ్యూనిటికీ చెందిన వ్యక్తి. ఆ స్టార్ హీరో కూడా వక్కలిగ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఈ ప్రాంతంపై అంబరీష్ కు మంచి పట్టుంది కూడా. సానుభూతి నేపథ్యంలో సుమలతకు అది అనుకూలాంశంగా మారే అవకాశం ఉంది.దీంతో జేడీఎస్ వెనక్కు తగ్గాల్సి ఉంటుంది. ఒకవేళ జేడీఎస్, కాంగ్రెస్ లు మద్దతు ఇవ్వకపోయినా.. సుమలత ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు మాత్రం రెడీగానే ఉందని ప్రచారం జరుగుతోంది.