వైకాపా సైకో పార్టీ: చంద్రబాబు

వైకాపా సైకో పార్టీ: చంద్రబాబు

అమరావతి : భాజపాయేతర పక్షాలు ఈవీఎంలపై ఇవాళ ఈసీకి ఫిర్యాదు చేయాలని ముందుగా నిర్ణయించాయని.. ఇది తెలిసి వైకాపా అధినేత జగన్ హడావుడిగా దిల్లీ వెళ్ళారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. సోమవారం నీరు-ప్రగతిపై సీఎం, సీఎస్ పునేఠా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జగన్ ఈసీని కలిసి ఏదో ఫిర్యాదు అని నాటకమాడుతున్నారని దుయ్యబట్టారు. వైకాపా సైకో పార్టీగా మారిందని మండిపడ్డారు. వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటూ.. పెట్టుబడులు రాకుండా కుట్రలు చేస్తున్నారని జగన్‌పై ఆగ్రహాం వ్యక్తంచేశారు. ప్రజలు కష్టాల్లో ఉండాలన్నదే సైకో వైకాపా ధోరణి అని విమర్శించారు. పింఛన్ల సభలు, ‘పసుపు-కుంకుమ’ కార్యక్రమాలను భగ్నం చేయడం జగన్ శాడిజానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.  అభివృద్ధి, సంక్షేమంలో రాజీపడరాదని సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎస్ పునేఠా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగున్నరేళ్లుగా అద్భుతమైన ఫలితాలు సాధించామని, ప్రజాదరణ పథకాలపై సానుకూలత పెంచాలని అధికారులకు సూచించారు. చిన్న పొరపాటు జరిగినా చేసిన మంచి పోతుందని చెప్పారు. కేంద్రం వైఫల్యాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని.. నరేగా, పోలవరానికి నిధుల విడుదలలో తీవ్రజాప్యం నెలకొందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి, సంక్షేమానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయని, అయినా రాజీపడకుండా ముందుకు పోతున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. 9వ తేదీన 4లక్షల గృహప్రవేశాలు విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. పెన్షన్ల పెంపు, పసుపు-కుంకుమ 2కు అపూర్వ ప్రజాదరణ లభించిందని చెప్పారు. రెండురోజుల్లో 24 లక్షల మందికి పెన్షన్ల పంపిణీ చేయాలని సీఎం ఆదేశించారు. 8వ తేదీ వరకు పెన్షన్ల పంపిణి జరుగుతుందన్నారు. పెన్షన్ల పండుగ విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలిపారు. చెక్కుల మార్పిడీలో బ్యాంకర్లు సహకరించాలని సీఎం కోరారు. ఆర్ధిక శాఖ రూ.4,100 కోట్లు విడుదల చేసిందని, బ్యాంకుల్లో రూ.2350 కోట్లు డిపాజిట్ చేశామని చెప్పారు. నగదు చెల్లింపులో మహిళలను ఇబ్బందులు పెట్టకూడదని బాబు అన్నారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. జొన్న, మొక్కజొన్న రైతులకు చెల్లింపులు జరపాలన్నారు. ధాన్యం సేకరణ ముమ్మరం చేయాలని తెలిపారు. రైతులను మోసగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. మిక్సింగ్ ప్లాంట్లపై నిఘా ముమ్మరం చేయాలన్నారు. గత ఏడాదికన్నా రిజర్వాయర్లలో నీటి మట్టం 6% తక్కువగా ఉందని, సమర్ధ నీటి నిర్వహణ జరపాలని అధికారులను సీఎం చంద్రాబు ఆదేశించారు. రబీ సీజన్‌లో 87% మాత్రమే సాగు జరిగిందని, దిగుబడి తగ్గకుండా శ్రద్దపెట్టాలని సూచించారు. కరవు మండలాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలన్నారు. ‘రాబోయే ఎన్నికలు మనందరికి ఫైనల్ పరీక్షలు, ఐదేళ్ల మన కృషికి ఈ పరీక్షా ఫలితాలే గీటురాయి’ అని చెప్పుకొచ్చారు. సుప్రీం న్యాయమూర్తుల ప్రశంసలు తాము చేసిన కృషికి గుర్తింపు అని, ఇదే స్ఫూర్తితో రాబోయే 6 నెలలు పనిచేయాలని అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos