ఎంతో కాలంగా రాయలసీమ వాసుల డిమాండ్ ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. సీమలో ఏపి హైకోర్టు ఏర్పాటు కోసం ఆ ప్రాంత వాసులు కోరుతూ వచ్చారు. అయితే, రాష్ట్ర విభజన తరువాత హైకోర్టు అమరావతిలో ఏర్పాటుకు నిర్ణయం తీ సుకున్నారు. ఫిబ్రవరి 3న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఈ కోర్టును ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో సీమ లో హైకోర్టు బెచ్ పై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై కోర్టు కేంద్రానికి కొన్ని ఆదేశాలు ఇచ్చింది.
సీమలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయండి..
ఏపి విభజన కు ముందు నుండి సీమలో హైకోర్టు ఏర్పాటు చేయలని పలువురు మేధావులు.. ఆ ప్రాంత వాసులు కోరు తూ వచ్చారు. గతంలో శ్రీబాగ్ ఒడంబడిక మేరకు హైకోర్టు బెంచి అయినా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసారు. 2014 లో రాష్ట్ర విభజన తరువాత వ్యవస్థ మొత్తం ఒకే చోట కాకుండా వికేంద్రీకరణ జరగాలనే సూచనలు వచ్చాయి. ఏపి లో కొత్త గా ఏర్పాటు చేసే హైకోర్టును రాయలసీమ లో ఏర్పాటు చేయాలని పెద్ద ఎత్తున ఒత్తిడి వచ్చింది. అయితే, ప్రభుత్వం పాలనా పరంగా రాజధానిలోనే హైకోర్టు ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా అమరావతిలో నిర్మాణం తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 3న భారత ప్రధాన న్యాయమూర్తి హైకోర్టను ప్రారంభించనున్నారు. ఇదే సమయంలో ఎంతో కాలంగా డిమాండ్ రూపంలో ఉన్న సీమలో హైకోర్టు బెంచ్ వ్యవహారం కోర్టుకు చేరింది.
హైకోర్టు కీలక ఆదేశాలు..
శ్రీబాగ్ ఒడంబడిక మేరకు సీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ సీనియర్ న్యాయవాది జె.నారాయణస్వామి 2017లో ఉమ్మడి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రాష్ట్ర విభజన అనంతరం రాజధాని ఆంధ్ర ప్రాంతంలో ఉన్నందున హైకోర్టును రాయలసీమలో ఏర్పాటు చేయాలని, ఆ మేరకు కేంద్రానికి ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. ఈ కేసు విచారణలో ఉండగానే అమరావతిలో హైకోర్టు ఏర్పాటు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ప్రథమ ధర్మాసనం ముందు ఈ వాజ్యం విచారణకు వచ్చింది. గతంలో కేంద్రంతో సంబంధం లేకుండా ఔరంగాబాద్ బెంచ్ను బాంబే హైకోర్టు సీజే ఏర్పాటు చేశారని, ఆ మేరకు హైకోర్టు సీజేకు అధికారాలున్నాయని పిటిషనర్ వాదించారు. ఆ తరువాత జరిగిన విచారణలో దీన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని గుర్తు చేశారు. ఆ తీర్పు ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి సీమలో కనీసం హైకోర్టు బెంచ్ అయినా ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. దీనిపై కేంద్రప్రభుత్వం తన అభిప్రాయాన్ని చెప్పాలని ఆదేశించింది.