యూట్యూబ్ యుద్ధం తారాస్థాయికి చేరింది. అతిపెద్ద యూట్యూబ్ ఛానల్గా పేరొందిన స్వీడిష్ దిగ్గజం ప్యూడైపై సబ్స్క్రైబర్ల సంఖ్యను భారత్కు చెందిన మ్యూజిక్ కంపెనీ టి-సిరీస్ ఛానల్ యూట్యూబ్ దాటేసే పరిస్థితి నెలకొంది. కొన్ని నెలలుగా రెండు సంస్థల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. భారత్కు చెందిన 33ఏళ్ల మ్యూజిక్ సంస్థ టి-సిరీస్కు గత మూడేళ్లుగా సబ్స్క్రైబర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా సరికొత్త వీడియోలను, బాలీవుడ్ సినిమాలు, ఇండో-పాప్ ఆర్టిస్టుల మ్యూజిక్ వీడియోలను పోస్టు చేయడంతో యూట్యూబ్ వీక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.మరోపక్క స్వీడిష్కు చెందిన యూట్యూబ్ స్టార్ ఫెలిక్స్ క్జెల్బర్గ్కు చెందిన ప్యూడైపైకు విపరీతమైన ఫ్యాన్ఫాలోయింగ్ ఉంది. ఇప్పటి వరకు యూట్యూబ్ చరిత్రలో ఇంతమంది ఫ్యాన్స్ మరే ఛానల్కు లేరు. ప్రస్తుతం దీనికి 83,842,513కు సబ్స్క్రైబర్లు ఉండగా.. ఆదివారం సాయంత్రానికి టి-సిరీస్కు 83,684,446మంది ఉన్నారు. అంటే వీరి మధ్య తేడా కేవలం 1.58లక్షలు మాత్రమే. దీంతో ప్యూడిపైను దాటేయడానికి టీసిరీస్కు మరికొన్ని రోజుల సమయం చాలన్నమాట.ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా చూసే చానల్ రికార్డు టి-సిరీస్కు సొంతమైంది. టి-సిరీస్ పోస్టు చేసిన మొత్తం వీడియోలను 60 బిలియన్ల మంది వీక్షించారు. ఇది కేటీ పెర్రీ, జస్టిన్ బీబర్ల యూట్యూబ్ ఛానల్స్కు మూడు రెట్లన్నమాట.టి-సిరీస్ను క్యాసెట్ కింగ్ గుల్షన్ కుమార్ ప్రారంభించారు. గుల్షన్ తండ్రి ఒక పాన్ షాప్ యజమాని. గుల్షన్ హత్య తర్వాత 1997లో ఆయన కుమారుడు భూషణ్ బాధ్యతలు చేపట్టారు. 2000లో భూషన్ కుమార్ టి-సిరీస్ను డిజిటల్ వేదికపై అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. బాలీవుడ్ నీడన టి-సిరీస్ దాదాపు 101 మిలియన్ డాలర్ల విలువైన కంపెనీగా ఎదిగింది. టాప్స్టార్ సినిమాల మ్యూజిక్లను ఈ కంపెనీ విడుదల చేసింది. గురు రంధ్వా వంటి పాప్స్టార్లతో ఒప్పందాలను చేసుకొని ఆల్బంలను విడుదల చేసింది.
దూసుకొస్తున్న టి-సిరీస్ను అడ్డుకోవడానికి ప్యూడిపై రకరకాల ఎత్తులు వేస్తోంది. సబ్స్క్రైబర్లను పెంచుకోవడానికి ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ మీద ప్యూడిపై మిలియన్ డాలర్లను వెచ్చించి బిల్బోర్డును ఏర్పాటు చేసింది. దీనికితోడు బ్రిటన్లోని ఒక రాజకీయ పార్టీ కూడా రంగంలోకి దిగి ప్యూడిపైకు అనుకూలంగా ట్వీట్ చేయించింది. చివరికి ప్రఖ్యాత వాల్స్ట్రీట్ జర్నల్ను హ్యాక్ చేసి ప్యూడిపైకి అనుకూలంగా పోస్టు పెట్టారు. ప్యూడిపై అభిమాని ఒకరు భారత్ టి-సిరీస్ ఆఫీస్ వద్ద హంగామా సృష్టించాడు. కానీ ఏది ఏమైనా ఇప్పుడు టి-సిరీస్, ప్యూడిపై మధ్య యుధం ఆన్లైన్లో హట్టాపిక్గా మారింది. టి-సిరీస్ దూకుడు చూస్తుంటే త్వరలోనే ప్యూడిపైను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.