ముంబై : అప్పు తీర్చడం లేదని ఓ వ్యక్తిని మరో వ్యక్తి కిరాతకంగా హత్య చేసి.. ఆ తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి టాయిలెట్లో పడేశాడు. ఈ దారుణ సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబైకి సమీపంలోని బచ్రాజ్ పారడైజ్ సోసైటీలో జనవరి 16న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. పింటూ అనే వ్యక్తి వద్ద గణేష్ విఠల్(58) లక్ష రూపాయాలు అప్పు తీసుకున్నాడు. ఈ అప్పును గణేష్ తీర్చలేకపోయాడు. దీంతో ఇరువురి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే జనవరి 16న పింటూ.. గణేష్ను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం గణేష్ను పింటూ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. తన ఇంటిలోని టాయిలెట్లో నాలుగు రోజుల పాటు ఆ ముక్కలను పడేసి నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అయితే మున్సిపల్ కార్మికులు స్థానికంగా ఉన్న డ్రైనేజీని శుభ్రపరుస్తుండగా మానవ మృతదేహం ముక్కలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడు పింటూను అరెస్టు చేశారు.