పట్నా: బిహార్లో రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ)కి చెందిన సీనియర్ నేతను సమష్టిపూర్ నగరంలో గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. జిల్లా కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షుడు రఘువర్ రాయ్ గురువారం ఉదయపు నడక కోసం ఇంటి నుంచి బయటకు రాగా ఈ ఘటన జరిగింది. కళ్యాణ్పూర్ ప్రాంతంలోని అతని ఇంటి వద్దకు బైక్పై వచ్చిన దుండగులు తుపాకీతో కాల్చి పారిపోయారు. ఈ దాడిలో గాయపడిన రఘువర్ రాయ్ను వెంటనే దర్బంగా మెడికల్ కళాశాలకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందారు. రాయ్ మృతితో ఆయన మద్దతుదారులు నగరంలో ఆందోళనలు చేపట్టారు. సమష్టిపూర్-దర్బంగా జాతీయ రహదారిపై అడ్డగించి ఆందోళన చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.