మనిషిలో మానవత్వం చచ్చిపోతున్నప్పుడు రాక్షసుడిగా మారుతాడు. ఇది ముమ్మాటికీ నిజమేనని చిత్తూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న ఉదంతాలు అద్దం పడుతున్నాయి. అంతేకాకుండా ఒక్కడిపై గుంపుగా దాడి చేసి, చితకబాదుతూ, ఆ దృశ్యాలను సెల్ కెమెరాలో వీడియో తీసి పైశాచిక ఆనందం పొందుతుండటం ఆందోళన కలిగించే అంశం. అంతేకాకుండా పెద్ద హీరోయిజంలా సామాజిక మాధ్యమాల్లో వాటిని పోస్ట్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి.ఇక ఈనెల 20న చిత్తూరులోని మిట్టూరుకు చెందిన గీతూరెడ్డి అనే మహిళ, ఆమె కుమారుడు శరత్కుమార్ సాదిక్ అనే యువకుడిపై దాడి చేసిన దృశ్యాలు చూసినవారు కడుపు తరుక్కుపోతోందంటున్నారు. సాదిక్ అతని స్నేహితుడి మధ్య ఓ యువతి విషయమై వివాదం రేగింది. దీనిపై పంచాయతీ చేయడానికి సాదిక్ను గీతూరెడ్డి తన ఇంటికి పిలిపించింది. తన గురించి ఇతరులకు ఎందుకు చెడుగా చెబుతావంటూ అతడిపై చేయి చేసుకుంది. అంతేకాకుండా ఆమె కుమారుడు కూడా పిడిగుద్దులు కురిపించాడు. ఆ తర్వాత గీతూరెడ్డితోపాటు ఉన్న శరత్ స్నేహితులు ఏడుగురు ఓ కల్యాణమండపం వద్ద మరోసారి సాదిక్ను చితకబాదారు. మొహం, కడుపుపై కాళ్లతో తన్నడం, పిడి గుద్దులు కురిపించడం, కింద పడ్డా పైకిలేపి మరీ కాళ్లతో తన్నడం.. ఈ మొత్తాన్ని వీడియో తీసి ఫేస్బుక్లో పెట్టురా! అని మరొకరు అనడం చూస్తుంటే రాన్రాను మనిషిలో మానవత్వం ప్రశ్నార్థకమవు తోంది. పైగా కొట్టిన పిల్లల్లో నలుగురు మధ్య తరగతి, ఉద్యోగాలు చేసుకుంటున్న తల్లిదండ్రుల పిల్లలు.. మైనర్లు ఉండటం గమనార్హం!