ప్రధాని మనసు దోచుకున్న పెళ్లి పత్రిక…!

ప్రధాని మనసు దోచుకున్న పెళ్లి పత్రిక…!

సూరత్: గుజరాత్‌కి చెందిన ఓ కొత్తజంట తమ పెళ్లి పత్రిక ను వినూత్నంగా ముద్రించి ప్రధామంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు అందుకున్నారు. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ప్రస్తుతం జాతీయ రాజకీయాలను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఒప్పందాన్ని సమర్థిస్తూ గుజరాత్‌కి చెందిన యువరాజ్ పోఖర్నా, సాక్షి అగర్వాల్ తమ పెళ్లికార్డును వినూత్నంగా రూపొందించారు. ‘‘రాఫెల్ ఒప్పందం గురించి కొన్ని వాస్తవాలు..’’ అంటూ పలు ఆసక్తికర విషయాలు ముద్రించారు. దీనిపై సంతోషం వ్యక్తంచేసిన ప్రధాని స్వయంగా ఆ కుటుంబానికి లేఖ రాశారు. ఈ శుభలేఖలోని విషయం చాలా ‘‘తెలివిగా’’ ఉందనీ.. దేశం కోసం మరింత కష్టపడి పనిచేసేలా తనకు స్ఫూర్తినిచ్చిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. సదరు జంటకు ఇవాళ సూరత్‌లో వివాహం జరగనుంది. కాగా ప్రధానమంత్రి నుంచి తన తల్లి బబిత ప్రకాశ్ పోఖర్నా పేరుతో ఈ నెల 17న ఉత్తరం అందినట్టు యువరాజ్ వెల్లడించాడు. ‘‘యువరాజ్, సాక్షిల వివాహ శుభ మహోత్సవం సందర్భంగా పోఖర్నా కుటుంబానికి హృదయపూర్వక అభినందనలు. అతిథులకు మీరు పంపిన వివాహ ఆహ్వాన పత్రిక చాలా వినూత్నంగా ఉంది. ఇందులో పేర్కొన్న విషయాలు దేశంపై మీకున్న ప్రేమకు అద్దం పడుతున్నాయి. మనం దేశం కోసం మరింత కష్టపడి పనిచేసేలా నాకు కూడా ఎనలేని స్ఫూర్తిని అందించాయి. నూతన దంపతులకు భగవంతుడు సంతోషకరమైన, సౌభాగ్యవంతమైన జీవితం ప్రసాదించాలని ప్రార్థిస్తూ మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను..’’ అని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు.

తాజా సమాచారం