నాంపల్లి, : పింఛనుదారులకు ప్రత్యేక రాష్ట్ర ప్రోత్సాహకం(ఇన్సెంటివ్), ఇంక్రిమెంట్ తక్షణమే మంజూరు చేయాలని తెలంగాణ పింఛనుదారుల కేంద్ర సంఘం అధ్యక్షుడు గాజుల నర్సయ్య, ప్రధాన కార్యదర్శి ఇ.నవనీతరావు, కార్యనిర్వాహక అధక్షుడు టి.ప్రేమ్కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పదో పీఆర్సీ నివేదిక ఆధారంగా 70 సంవత్సరాలు నిండిన పింఛనర్లకు 15 శాతం క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని కోరారు. శనివారం వారు పీఆర్సీ ఛైర్మన్ బిస్వాల్ను కలిసి ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గాజుల నర్సయ్య, నవనీతరావు మాట్లాడుతూ.. పింఛనుదారుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పింఛనుదారులకు కూడా ప్రత్యేక రాష్ట్ర ప్రోత్సాహకం, ఇంక్రిమెంట్ ఇస్తామని నాలుగేళ్ల క్రితం హామీ ఇచ్చిన సీఎం ఇప్పటివరకు అమలు చేయలేదని వాపోయారు. ఈ పీఆర్సీలో 65 శాతం ఫిట్మెంట్, 45 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.