నాలుగో వన్డేలో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. న్యూజిలాండ్ జట్టుపై ఇప్పటికే 3-0 తేడాతో సిరీస్ గెలిచిన టీమిండియా క్లీన్ స్వీప్ చేసే అవకాశం కోల్పోయింది. ఇటు బ్యాట్స్మెన్, అటు బౌలర్లు రాణించడంతో నాలుగో వన్డేలో కివీస్ జట్టు అలవోకగా విజయం సాధించింది. మరోవైపు 200వన్డే ఆడుతున్న రోహిత్ శర్మకు ఈ వన్డే చేదు అనుభవాన్ని మిగిల్చింది. గురువారం హామిల్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని కివీస్ అలవోకగా సాధించింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 14.4 ఓవర్లలో మ్యాచ్ను ముగించింది. టీమిండియాపై కివీస్ జట్టు 8వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో 3-1 తేడాతో క్లీన్ స్వీప్ నుంచి కివీస్ తప్పించుకుంది.
తొలుత టాస్ గెలిచిన కివీస్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే టీమిండియాను 92 పరుగులకే ఆలౌట్ చేసిన అనంతరం బ్యాటింగ్కు దిగింది. ఈ క్రమంలో కివీస్ తొలి ఓవర్లోనే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ మార్టిన్ గప్తిల్(14)ను భువి పెవిలియన్ చేర్చాడు. తర్వాత వన్డౌన్ బ్యాట్స్మెన్గా వచ్చిన విలియమ్సన్ కూడా భువి ఔట్ చేశాడు. ఈ దూకుడులో టీమిండియానే విజయం సాధించేలా కనిపించింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన రాస్ టేలర్(37), నికోల్స్(30) జోడీ రాణించి 54 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. ఇద్దరూ బౌండరీల వరద పారిస్తూ ఐదు ఓవర్లలో 42 పరుగులు చేశారు. దీంతో 15 ఓవర్లు కూడా పూర్తి చేయకుండానే రెండు వికెట్ల నష్టానికి కివీస్ 93 లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఐదు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ట్రెంట్ బౌల్ట్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాన్’గా నిలిచాడు.