ముంబయి: బడ్జెట్ అనంతరం స్టాక్ మార్కెట్లలో తొలి ట్రేడింగ్ సెషన్ నష్టాలతో ప్రారంభమైంది. ఉదయం 9.33 సమయంలో సెన్సెక్స్ 93 పాయింట్ల నష్టంతో 36,375 వద్ద, నిఫ్టీ 28 పాయింట్ల నష్టంతో 10,865 వద్ద ట్రేడవుతోంది. తొలుత 141 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఆ తర్వాత కోలుకొంది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ దాదాపు 35 పైసలు విలువ కోల్పోయింది. ముఖ్యంగా బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలను ప్రకటించడంతో రూపాయి బలహీనపడింది. ఈ వారం కోల్ ఇండియా, ఐడీబీఐ బ్యాంక్, ఐవోబీ, టెక్ మహీంద్రా, గెయిల్, హెచ్పీసీఎల్, ఏసీసీ, బీహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ , ఎంఅండ్ఎం, డీఎల్ఎఫ్ వంటి దిగ్గజ సంస్థలు ఫలితాలను ప్రకటించనున్నాయి. కొరియా సూచీలు తప్పితే మిగిలిన ఆసియా మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. శుక్రవారం దాదాపు 3శాతం లాభపడ్డ చమురు ధరలు నేడు కొంచెం కుంగాయి. కానీ కొనుగోళ్లు కొనసాగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.