దిల్లీ: దేశ సమగ్ర వికాసమే ప్రధానమంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. లోక్సభలో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి వర్గానికి మేలు కలగాలనేది తమ ఆశయమని స్పష్టం చేశారు. ‘‘రైతులకు ఏటా రూ.6వేలు చొప్పున చెల్లించాలనే నిర్ణయం చరిత్రాత్మకమైనది. సంవత్సరానికి రూ.6వేల ఆర్థిక సహాయం చిన్న రైతులకు గొప్ప ఊరట. ఆర్థిక క్రమశిక్షణ పాటించి, నిధులు పొదుపు చేసి రైతులకు మేలు చేస్తున్నాం. రైతుల కోసం మేం తీసుకున్న నిర్ణయం ఎవరూ తీసుకోలేదు. 12.5 కోట్ల మంది రైతులకు ఈ పథకం ద్వారా మేలు కలుగుతుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 2018 డిసెంబరు నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. అసంఘటిత రంగ కార్మికులకు మేలు చేసే పింఛన్ పథకం కూడా చాలా గొప్పది. పింఛన్ పథకం ద్వారా కోట్లాది మందికి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పటికే ముద్ర రుణాల ద్వారా అసంఘటిత రంగ కార్మికులను ఆదుకున్నాం. నామమాత్రమైన రూ.100 ప్రీమియం చెల్లిస్తే రూ.3వేలు పింఛను ఇస్తాం’’ అని పీయూష్ గోయల్ వెల్లడించారు.