ముంబై: నిషేధిత సీపీఐ-మావోయిస్టు పార్టీతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై దళిత మేథావి ఆనంద్ టెల్టుంబ్డేని పుణే పోలీసులు అరెస్టు చేశారు. ఎల్గార్ పరిషత్ కేసులో ఇవాళ తెల్లవారుజామున ఆయనను ముంబై ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. టెల్టుంబ్డే ప్రస్తుతం గోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. పుణేలోని ప్రత్యేక కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసినట్టు కనిపిస్తోంది. తొలుత ఆయనను కొంతసేపు ప్రశ్నించామనీ.. అనంతరం అదుపులోకి తీసుకున్నామని పుణే జాయింట్ కమిషనర్ శివాజీ బోద్కే వెల్లడించారు. కాగా భీమా కోరెగావ్ అల్లర్ల వెనుక టెల్టుంబ్డే ప్రమేయం ఉందని చెప్పేందుకు తగిన ఆధారాలు సేకరించామంటూ దర్యాప్తు అధికారులు శుక్రవారం అదనపు సెషన్స్ జడ్జి కిషోర్ వదనే దృష్టికి తీసుకువచ్చారు. 2017 డిసెంబర్ 31న పుణేలో జరిగిన ఎల్గార్ పరిషత్ కాన్క్లేవ్కు మావోయిస్టులు మద్దతు ఉందని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ సదస్సులో రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్లే తర్వాతి రోజు భీమా కోరేగావ్ వార్ మెమోరియల్ వద్ద అల్లర్లు జరిగాయని పోలీసులు చెబుతున్నారు.