భోపాల్ : దళితుని హత్య చేసిన అనంతరం తాను చనిపోయినట్లుగా నమ్మించి ఇన్సూరెన్స్ క్లెయిమ్ రూ. 20 లక్షలు పొందిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కోసం గాలిస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు మంగళవారం తెలిపారు. ఇటీవల ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతిచెందడంతో బిజెపి, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలకు పాల్పడిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని బిజెపి ఆరోపించింది. బిజెపి కార్యకర్తలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్నారని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. జనవరి 23న పాటిదార్కు చెందిన పొలంలో ఒక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. గతరాత్రి పాటిదార్ పొలంలో నీళ్లు పెట్టేందుకు వెళ్లారని అనంతరం అతను ఇంటికి తిరిగి రాలేదని కుటుంభసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మృతిచెందిన వ్యక్తి పాటిదార్ అని పోలీసులు దృవీకరించారు. అయితే ఆ మృతదేహం పాటిదార్ పొలంలో పనిచేసే మదన్మాల్వియా అనే కార్మికుడదని అనంతరం పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయిన హిమ్మత్ పాటిదార్ గత వారం ఒక వ్యవసాయ కార్మికుడిని హత్య చేసిన అనంతరం అతని ముఖాన్ని గుర్తుపట్టకుండా ఉండేందుకు కాల్చినట్లు తెలిపారు. అనంతరం ఆ మృతదేహం తనదిగా పోలీసులను నమ్మించినట్లు పేర్కొన్నారు. దీంతో అతని పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ను పొందినట్లు రాట్లమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ తివారి వెల్లడించారు. దీంతో మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు నిర్వహించిన డిఎన్ఎ పరీక్షలో అసలు మోసం బట్టబయలైంది. దీంతో పోలీసులు నిందితుడు హిమ్మత్ పాటియాలా కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తివారి తెలపారు.