టీడీపీ సీనియర్ నాయకులు, మత్స్యకార సామాజికవర్గ రాష్ట్ర నాయకుడు బొమ్మిడి నాయకర్ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం పీచుపాలెంలో ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నాయకర్ ఈ విషయాన్ని ప్రకటించారు. తన రాజీనామాను జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మికి ప్యాక్స్ పంపానన్నారు. ‘‘12 ఏళ్లుగా టీడీపీలో కొనసాగుతున్నా..పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచా. అధికారంలోకి వస్తే పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఎమ్మెల్సీ ఇస్తారన్న హామీ ఇచ్చారు…కానీ నాలుగేన్నర ఏళ్లు గడిచినా సరైన గుర్తింపు ఇవ్వలేదు. ఆర్థికంగా నష్టపోయా…’’ఇంకా పార్టీలో కొనసాగితే భవిష్యత్ ఉండదనే రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో బొమ్మిడి నారాయణరావుకు ఎమ్మెల్సీ పదవిఇచ్చింది. ఖాళీ అయిన తరువాత ఆ పదవిని తిరిగి ఆదే సామాజిక వర్గానికి ఇవ్వలేదు. ఈ విషయం కూడా నన్ను బాధించింది. కార్పొరేషన్ చైర్మన్ల్లోనూ మా సామాజిక వర్గానికి సరైన పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవన్ని ఆలోచించి పార్టీని వీడాను.జనసేన అధినేత పవన్ కళ్యాన్ సిద్దాంతాలు, ఆశయాలు నచ్చాయి. బీసీలకు,ప్రధానంగా అగ్నికులక్షత్రీయులకు ఆయన ఇస్తున్న ప్రాధాన్యం నచ్చి ఆ పార్టీలోకి వెళ్లుతున్నా. త్వరలో పవన్ సమక్షంలో ఆ పార్టీలో చేరతానని నాయకర్ చెప్పారు. సమావేశంలో చినమిల్లి నర్సింహామూర్తి, తిరుమాని కాంతారావు, అబ్దుల్ సత్తార్, పెదసింగ్ సాంబ, సత్యనారాయణ, ప్రభుదేవ్ తదితరులు పాల్గొన్నారు.