ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఇప్పటికే పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యనేతలతో భేటీ అవుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. తాజాగా మరో కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఫెడరల్ ఫ్రంట్ తో కలిసి వచ్చే అంశంపై చర్చలు జరపాలని డిసైడ్ అయ్యారు.
ఇందుకోసం తన కుమారుడు కమ్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు.. పార్టీకి చెందిన కీలక నేతలు వినోద్.. పల్లా రాజేశ్వర్ రెడ్డి.. శ్రావణ్ కుమార్ రెడ్డి తదితరులతో కలిసి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్.. యూపీ మాజీ సీఎం అఖిలేశ్.. డీఎంకే అధినేత స్టాలిన్ తో పాటు.. దేవగౌడతోనూ చర్చలు జరిపారు.
ఇప్పటివరకూ ఎన్డీఏ.. యూపీఏ రెండు కూటమిల్లో లేని జగన్ ను ఫెడరల్ ఫ్రంట్ లో చేరాలన్న ఆహ్వానాన్ని కేసీఆర్ తరఫున కేటీఆర్ అండ్ కో ఇవ్వనున్నారు. మరి.. ఈ విషయంపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. కీలక ఎన్నికలకు ముందు కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ లో చేరేందుకు జగన్ ఓకే అంటారా? లేదా? అన్నది చూడాలి. హైదరాబాద్లో జరగనున్న ఈ రాజకీయ భేటీ.. ఏపీలో తీవ్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.