గలగలా కృష్ణమ్మ పరుగులెడుతు చిత్తూరు జిల్లాను తాకింది.. కరవు ప్రాంత ప్రజల్లో ఆనందం నింపింది. జిల్లాలోని పశ్చిమ మండలాలు ఇక సస్యశ్యామలం కానున్నాయి. హంద్రీ-నీవా జలాలు సోమవారం ఉదయం అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోకి ప్రవేశించాయి. దీంతో ఏటా కరవుతో అల్లాడే పీలేరు, పుంగనూరు, పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె నియోజకవర్గాల ప్రజలకు తీపి కబురు అందింది. వందల సంవత్సరాలుగా నీటి జాడ తెలియని ఈ ప్రాంతవాసులు తరలివస్తున్న కృష్ణ జలాలను మేళతాళాలతో ఘనంగా ఆహ్వానించారు. హారతులు పట్టారు. పలువురు గంగమ్మకు బోనాలు సమర్పించారు. యువకులు, మహిళలు, చిన్నారులు, వృద్ధులు కృష్ణా జలాల్లో తడిసి ముద్దయ్యారు. భక్తి భావనతో పసుపూ, కుంకుమ, పుష్పాలను సమర్పించారు. ముందుగా మంగళవారం చిత్తూరు జిల్లాలోని పెద్దతిప్పసముద్రం పెద్దచెరువును కృష్ణా జలాలతో నింపనున్నారు. అక్కడి నుంచి పుంగనూరు బ్రాంచి కాలువ ద్వారా మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు ఈ నీటిని తరలించనున్నారు. ఫిబ్రవరి నెలాఖరు కల్లా పలమనేరు, కుప్పం ప్రాంతాలకూ కృష్ణా జలాలను తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు.