హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్పై వైకాపా, తెరాస మధ్య చర్చలు ప్రారంభమయ్యాయి. ఫెడరల్ ఫ్రంట్తో కలిసి వచ్చే విషయంపై వైకాపాతో చర్చలు జరపాలని తెలంగాణ రాష్ట్రముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్ నిర్ణయించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు తెరాస నేతలు కేటీఆర్, వినోద్, పల్లా రాజేశ్వర్రెడ్డి, శ్రావణ్కుమార్రెడ్డి తదితరులు ఈరోజు లోటస్పాండ్లోని జగన్ నివాసానికి చేరుకుని చర్చలు ప్రారంభించారు. కాంగ్రెస్, భాజపాలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు కేసీఆర్ శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పటికే పశ్చిమ్బంగా సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్యాదవ్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్తో కేసీఆర్ చర్చలు జరిపారు. యూపీఏ, ఎన్డీఏ కూటమిలో లేని జగన్ ఫెడరల్ ఫ్రంట్తో కలిసివెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూపీఏ కూటమితో తెదేపా అధినేత చంద్రబాబు జట్టుకట్టడం, ఆంధ్రప్రదేశ్లో భాజపాకు ఎదురుగాలి వీస్తుండటంతో జగన్ ముందున్న మూడో ప్రత్యామ్నాయం ఫెడరల్ ఫ్రంట్ ఒక్కటే కనిపిస్తోంది. మరో వైపు తెలంగాణలో మహాకూటమి తరఫున ప్రచారం చేసిన ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్తో తెరాస నేతల భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో వైకాపా, తెరాస నేతల భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.