కపిల్‌కి థ్యాంక్స్ చెప్పిన మోదీ…

కపిల్‌కి థ్యాంక్స్ చెప్పిన  మోదీ…

న్యూఢిల్లీ: ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానితో తాను దిగిన ఓ ఫోటోను కపిల్ శర్మ ట్విటర్లో షేర్ చేసుకున్న సందర్భంగా ఆయన చెప్పిన విషయాలపై ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.  ఇటీవల ప్రధాని మోదీతో గడిపిన క్షణాలపై కపిల్ స్పందిస్తూ… ‘‘గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ.. మిమ్మల్ని కలుసుకోవడం, స్ఫూర్తివంతమైన మీ ఆలోచనలు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన దేశం, సినీ పరిశ్రమపై మీకున్న ప్రగతిశీల దృక్పథం అద్భుతం. అలాగే మీకు మంచి హాస్య  చాతుర్యం కూడా ఉందని నేను చెప్పగలను. ధన్యవాదాలు…’’ అని ట్వీట్ చేశాడు. దీనిపై ప్రధాని మోదీ ట్విటర్‌లో స్పందిస్తూ… ‘‘ఒకరి హాస్య చాతుర్యాన్ని కపిల్ శర్మ మెచ్చుకుంటే అది తప్పకుండా ఆ వ్యక్తికి సంతోషం కలిగిస్తుంది. అందుకు నేను కూడా అతీతుడిని కాదు. అలా చెప్పినందుకు మీకు కృతజ్ఞతలు కపిల్…’’ అని పేర్కొన్నారు. కాగా ఈ నెల 19న ముంబైలో భారత తొలి సినిమా మ్యూజియాన్ని ప్రారంభించిన సందర్భంగా పలువురు టీవీ, సినిమా నటులు ప్రధాని మోదీని కలుసుకున్న సంగతి తెలిసిందే.

తాజా సమాచారం