ఇద్దరు వ్యక్తుల మధ్య వివాదం కేసరపల్లిలో రెండు సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామంలో మూడు రోజుల క్రితం ఇద్దరు యువకుల మధ్య వివాద మేర్పడి, ఒకరిపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదుచేశారు. ఈనేపథ్యంలో గత మూడు రోజులుగా గ్రామంలోని రెండు వర్గాల కాలనీల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదివారం ఒకసామాజిక వర్గం యువకులు కొందరు తమ వర్గమే గొప్పదంటూ.. దాడి ఘటనకు సంబంధించిన వీడియోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆగ్రహించిన మరో వర్గంవారు ఆ వీడియోపై నిరసన తెలుపుతూ కేసరపల్లి వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని జాతీయ రహదారిపై బైఠాయించిన ఆందోళనకారులను గ్రామంలోకి పంపారు. రాస్తారోకోకు వెళ్లే క్రమంలో వారిలో కొందరు మరో వర్గానికి చెందిన యువకుడిపై దాడిచేయడంతో తిరిగి అదే మార్గంలో వస్తున్న ఆందోళన కారులను తమ కాలనీ దాటి వెళ్లకుండా మరో వర్గం అడ్డుకుంది. విజయవాడ ఈస్ట్ జోన్ ఏసీపీ విజయ్భాస్కర్, డీసీపీ బాల పలువురు పోలీసు ఉన్నతాధికారులు బలగాలతో కేసరపల్లి చేరుకుని పరిస్థితి అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.