లక్నో
: ‘మా తండ్రి మరణించినప్పుడు మాకు కలిగిన బాధే ఇప్పుడు మీకు కలిగింది. ఆ బాధేంటో
మాకు బాగా తెలుసు’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయన సోదరి
ప్రియాంక గాంధీ ఆక్రోశించారు. పుల్వామా ఉగ్రదాడిలో అకాల మృత్యువాత పడిన సీఆర్ఫీఎఫ్
జవాన్ అమిత్ కుమార్ ఇంటికి బుధవారం వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. జవాన్
చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాయత్రి మంత్రాన్ని పఠించి, భారత్ మతాకీ జై అని నినాదాలు చేశారు. ‘ఈ
విషాదంలో మీకు అండగా ఉంటామని చెప్పడానికి ఇక్కడికి వచ్చాం. దేశం కోసం నీ బిడ్డ
ప్రాణత్యాగం చేసి మా గుండెల్లో నిలిచిపోయారు. అంతటి గొప్ప బిడ్డను కన్నందుకు మీకు
ధన్యవాదాలు.’ అని బాధితులతో రాహుల్ గాంధీ అన్నారు. దీనికి సంబంధించిన వీడియోలను
కాంగ్రెస్ పార్టీ తమ సామాజిక మాధ్యమ వేదికల్లో వేసారు. ఏలాంటి రాజకీయ ప్రయోజనాల్ని ఆశించకుండా తమ
పార్టీ ముఖ్య నేతలు అత్యంత గోప్యంగా పుల్వామ ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించారని
కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. రాహుల్ గాంధీ తన పర్యటన మధ్యలో ఓ దాబలో సేద తీరిన
వీడియోనూ పోస్ట్ చేశారు. 1991లో తమిళ టైగర్స్ ఆత్మహత్య బాంబుకు అప్పటి ప్రధాని, రాహుల్ తండ్రి రాజీవ్
గాంధీ మరణించిన విషయం తెలిసిందే. ఆ విషాదాన్ని గుర్తు చేసుకుంటూ రాహుల్ పుల్వామా బాధితులకు
సాంత్వన పలికారు.