ఆసుపత్రిలో ఘోరం.. మెట్లు తగిలి బిడ్డ మృతి

ఔరంగాబాద్: ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఆసుపత్రి మెట్లపై ప్రసవించడంతో.. తలకు గాయాలై.. ఓ పసిపాప మృతి చెందింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్న ఈ ఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం.. వసతుల లేమి కారణంగానే ఇది జరిగిందని బంధువులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే తీవ్ర నొప్పులతో బాధపడుతున్న సొనాలి ఖొంజాడే అనే మహిళ తల్లిదండ్రులతో పాటు హాస్పిటల్‌కు మంగళవారం రాత్రి 1.30గంటల ప్రాంతలో వచ్చింది. అక్కడ వార్డ్ బాయ్స్ ఎవరూ అందుబాటులో లేరు. దీంతో స్ట్రెచర్‌పై తీసుకువెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే అవి కూడా అక్కడ లేవు. లిఫ్ట్ కోసం చూస్తే.. అది పనిచేయడం లేదు. దీంతో చేసేదేమి లేక మెట్ల ద్వారా ఆపరేషన్ థియేటర్‌కు తీసుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే నొప్పులతో విలవిల్లాడుతున్న ఆమె… మెట్లపై అతి కష్టం మీద నడవసాగింది. నొప్పులు మరింత తీవ్రం కావడంతో.. అక్కడే ప్రసవించింది. కానీ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. మెట్లపై పడటం వల్ల.. బిడ్డ తలకు దెబ్బలు తగిలి పురిట్లోనే చనిపోయింది. అయితే ఈ విషయం ఇంకా సొనాలీకి తెలియదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos