ఏపీలో ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోతున్నాయ్. సంస్థ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో ఫిబ్రవరి 6 నుంచి సమ్మెకు దిగుతున్న ప్రకటించాయి కార్మిక సంఘాలు. తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు సమ్మె కొనసాగిస్తామంటున్నారు యూనియన్ నేతలు.ఏపీలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగింది. సమ్మె తేదీని కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఫిబ్రవరి 6 నుంచి సమ్మె చేపట్టనున్నామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. ఆ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ సమ్మెలో ఈయూ సహా 9 కార్మిక సంఘాలు పాల్గొననున్నాయి. 13 జిల్లాల్లో 11వేలకుపైగా బస్సులున్న ఆర్టీసీలో 52 వేల మంది కార్మికులున్నారు. వీరికి 2017 ఏప్రిల్ 1న వేతన సవరణ చేయాల్సి ఉంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల భారంతో సంస్థ 21 నెలలుగా జాప్యం చేస్తూ వస్తోంది. గత ఏడాది గుర్తింపు సంఘమైన ఎన్ఎంయూ ఒత్తిడితో 19% ఫిట్మెంట్ ఇచ్చిన యాజమాన్యం, ఆ తర్వాత గుర్తింపు సంఘంగా విజయం సాధించిన ఈయూ నేతలతో చర్చలు జరిపినా కొలిక్కి రాలేదు.దీంతో 91 డిమాండ్లతో డిసెంబర్ 31న ఆర్టీసీ యాజమాన్యానికి ఈయూ సమ్మె నోటీసు ఇచ్చింది. దీనిపై అనేక ధపాలు చర్చలు జరిపింది. కానీ 20 శాతానికి మించి ఫిట్మెంట్ ఇవ్వలేమని స్పష్టం చేసింది ఆర్టీసీ యాజమాన్యం. దీంతో సమ్మెకు దిగాలని నిర్ణయించింది కార్మిక సంఘాల జేఏసీ తమది న్యాయమైన డిమాండ్లు అని, వాటిని సాధించుకునే వరకు పోరాటం చేస్తామంటున్నారు యూనియన్ నేతలు. సమ్మె సైరన మోగడంతో.. ఫిబ్రవరి 6 నుంచి ఆర్టీసీ రథచక్రాలు ఆగిపోనున్నాయి.