ఆర్లాండ్ పార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఇల్లినాయిస్లోని ఆర్లాండ్ స్క్వేర్ మాల్ సమీపంలో 19ఏళ్ల యువకుడు కాల్పులకు తెగబడ్డాడు. బుల్లెట్లు తగలడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడి పక్కన ఉన్న మరో వ్యక్తి కాలుకి గాయమైందని, ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని పోలీసులు వెల్లడించారు. నిందితుడు కాల్పులు జరిపిన అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.నిందితుడు మాల్లో నుంచి పారిపోతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయని, అయితే మాల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఎటు వెళ్లాడో తెలియరాలేదని డిప్యూటీ పోలీస్ చీఫ్ జోసెఫ్ మిచెల్ తెలిపారు. చనిపోయిన వ్యక్తి లక్ష్యంగానే కాల్పులు జరిగినట్లు తెలుస్తోందని వెల్లడించారు. మాల్ షికాగోకు 32కిలోమీటర్ల దూరంలో ఉన్నందున ఘటన జరిగిన వెంటనే ఎఫ్బీఐ, ఏటీఎఫ్ సహా పలు ఏజెన్సీలు స్పందించి మాల్కు చేరుకున్నాయి. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.