పాక్ చెర నుంచి
విముక్తి పొందిన సొంత గడ్డపై కాలుమోపనున్న వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్కు ఘన
స్వాగతం పలికేందుకు పాక్- భారత్ సరిహద్దులోని వాఘా వద్ద భారత రక్షణ దళాలు భారీ
ఏర్పాట్లు చేసాయి. శుక్రవారం సాయంత్రంలోగా అభినందన్ మాతృదేశంలోకి
ప్రవేశించనున్నారు. దరిమిలా శుక్రవారం ఉదయం నుంచి వేలాదిగా స్థానికులు, బంధువులు,
బలగాల కుటుంబాలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ఒక వైపు పండుగ వాతావరణం,
మరోవైపు ఉద్విగ్నత ఆవరించటంతో
అవాంఛనీయాల్ని నివారించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసారు. భారీగా పంజాబ్ పోలీసు బలగాలు అక్కడ మొహరించాయి. అమృత్సర్లోనూ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.భారత సరిహద్దు బలగాలతో పాటు వాయుసేన అధికారులు కూడా వాఘాకు చేరుకోనున్నట్లు సమాచారం. అభినందన్కు స్వాగతం పలకడానికి తనకు అవకాశం ఇవ్వాలంటూ పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ప్రధాని మోదీని కోరారు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్ను భారత రాయబార కార్యాలయంలో రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. అనంతరం వారు అయనను వాఘా సరిహద్దుకు తీసుకువస్తారని తెలిసింది.