లండన్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా అభిమానులున్నారు. పాకిస్తాన్లో సైతం అతనికి వీరాభిమానులున్నారని ఆ జట్టు మాజీ కెప్టెన్ యూనిస్ ఖాన్ తెలిపాడు. ప్రపంచ కప్పులో భాగంగా లండన్లో నిర్వహించిన సలాం క్రికెట్ 2019లో యూనిస్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ దేశంలో కోహ్లీ అంటే పడి చచ్చిపోతారని అన్నాడు. పాక్ ప్రజలు అతనిని అమితంగా ప్రేమిస్తారని, యువత అతడిలా బ్యాటింగ్ చేయాలని ఉవ్విళ్లూరుతుందని తెలిపాడు. ప్రపంచ కప్పులో టీమిండియాకు కోహ్లీనే కీలకమని, అతడి రాణింపుపైనే భారత్ గెలుపోటములు ఆధారపడి ఉంటాయని చెప్పాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న వెస్టిండీస్ దిగ్గజ బ్యాట్స్మన్ వివియన్ రిచర్డ్స్ మాట్లాడుతూ, తనకు భారత బ్యాట్స్మెన్ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. వారు గర్వాన్ని, పొగరును ప్రదర్శించరని, ఆటపైనే శ్రద్ధ కనబరుస్తారని వివరించాడు. కోహ్లీ టీమిండియా బలమని కితాబునిచ్చాడు.