వర్క్‌ ఫ్రమ్‌ హోమ్…ఇక శాశ్వతమా…!

కరోనా మహమ్మారి కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చిన సంస్థలు ఇప్పుడు దానిని శాశ్వతంగా కొనసాగించాలని ఆలోచిస్తున్నాయి. తాజాగా బీసీజీ-జూమ్ నిర్వహించిన సర్వేలో 87 శాతం సంస్థలు శాశ్వత వర్క్ ఫ్రమ్ హోమ్ వైపు మొగ్గు చూపినట్లు తేలింది. అంతే కాకుండా, కరోనా కాలంలో ఇంటి నుంచి పని చేసే వాళ్ల సంఖ్య ఇప్పటికి మూడు నుంచి ఐదు రెట్లు పెరిగినట్లు కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. ప్రపంచ ఆర్థిక సంక్షోభ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలపై పడిన ఆర్థిక ప్రభావం, పనితీరు గురుంచి అంచనా వేయడానికి బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్(బీసీజీ)తో కలిసి జూమ్ ఈ సర్వే నిర్వహించింది.
ప్రపంచంలో ఇండియాతో సహా యూఎస్, యూకే, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల్లో ఈ సర్వే నిర్వహించారు. చిన్న చిన్న సమస్యలు తప్ప, కరోనా మహమ్మారి ముందుకంటే ఇప్పుడు పనితీరు బాగా మెరుగైనట్లు సంస్థలు పేర్కొన్నాయి. సర్వే చేసిన సంస్థల ఉద్యోగులలో మేనేజర్ స్థాయి ఉద్యోగులను ఇంటర్వ్యూ చేయగా 70 శాతం మంది రిమోట్ వర్కింగ్‌కు అనుకూలంగా ఓటేశారు. కరోనా సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కంపెనీలకు పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవగా, అటు చాలా మంది తమ ఉద్యోగాలు కోల్పోకుండా నిలుపుకోగలిగారు. ఒక్క యూరప్‌లోనే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా 22.8 లక్షల ఉద్యోగాలు నిలిచాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos